Bandi Sanjay : కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఓట్ల చోరీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్;
కాంగ్రెస్ పార్టీ మరో సారి అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసకుంటానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఓట్ల చోరీతో గెలిచామని తనతో పాటు బీజేపీ ఎంపీలు అందరిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు చేసిన ఆరోపణలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందిచారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ వార్డు మెంబర్గా కూడా గెలవలేరని విమర్శించారు. కరీంనగర్ ప్రజలకు మహేష్ గౌడ్ అంటే ఎవరో కూడా తెలియదని అటువంటి వ్యక్తి బీజేపీ ఓట్లు చోరీ చేసిందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రావడం కల అని బండి సంజయ్ జోస్యం చెప్పారు. కరీంనగర్లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. మహేష్గౌడ్ ఓట్ల చోరీ గురించి మాట్లాడటం కన్నా వాళ్ళు చేసిన సీట్ల చోరీ విషయంపై సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించాలన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఓటర్ల జాబితాలను సవరించి మళ్ళీ ఎన్నికలకు పోయే సత్తా ఉందా అని ప్రశ్నించారు. ప్రజలను కలవకుండా రాత్రి పూట పాదయాత్ర చేయడమేంటో అర్ధం కావడం లేదని మహేష్ గౌడ్ చేస్తున్న పాదయాత్రపై బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఒకవేళ ఓట్ల చోరీ గనుక జరిగి ఉంటే మిగిలిన ఎనిమిది సీట్లు మేమే గెలిచేవాళ్ళం కదా అని బండి సంజయ్ అన్నారు.