Pawan Kalyan’s Strong Remark Draws Attention: తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారని, బెదిరింపులకు లొంగేవాడిని కాదని హెచ్చరికలు జారీ చేశారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

“ఈ మధ్య కొందరు నన్ను ‘హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావు.. ఇక్కడ నీకేం పని’ అని అడుగుతున్నారు. మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి? బెదిరించేవాళ్ల అయ్య జాగీరా తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా?” అని ప్రశ్నించారు.

తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తిని తాను అని, ఆంధ్రాలో తనను తిరగనివ్వకపోతే తెలంగాణ ప్రజలే వారాహి అనుమతి ఇచ్చారని చెప్పారు. “నాకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం” అని గుర్తు చేశారు.

తనకు అధికారంపై ప్రేమ లేదని, మార్పుపైనే ప్రేమ ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌పై విద్వేషం లేదని, ఉంటే ఒక్క ఆంధ్ర వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవాడు కాదన్నారు.

“నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు.. విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకిని. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి వచ్చాను” అని వివరించారు. బెదిరింపులకు లొంగిపోయేవాడిని కాదని, గద్దర్ బతికున్న రోజుల్లో తాను ఆయనకు సహాయం చేశానని, మరికొందరు ఏం చేశారని ప్రశ్నించారు.

ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైందని, ఆయనపై కేసులు పెట్టకూడదని తానే చెప్పానని తెలిపారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రవాసులే కారణమా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఈ మీడియా సమావేశం తెలంగాణ-ఆంధ్ర సంబంధాలు, రాజకీయ పరిణామాలపై దృష్టి సారించింది.

Tags: