Telangana Assembly Sessions Begin: తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మణ్‌రెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై సభ్యులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సమావేశాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కేసీఆర్‌ వద్దకు వెళ్లి పలకరించడం గమనార్హం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు వంటి వారు కూడా కేసీఆర్‌కు అభివాదం చేశారు. సంతాప తీర్మానాలు పూర్తయిన తర్వాత కేసీఆర్‌ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఈ సమావేశాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఓఆర్‌ఆర్‌ ప్రాంత మున్సిపాలిటీల విలీనం, జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయడం, తెలంగాణ జీఎస్‌టీ సవరణలు, ఉద్యోగుల హేతుబద్ధీకరణ వంటి ముఖ్య అంశాలకు చట్టబద్ధత కల్పించే బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

మొదటి రోజు సభ వాయిదా అనంతరం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Tags: