Telangana Cabinet Meeting Tomorrow: ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇద్దరు పిల్లల నియంత్రణ ఆర్డినెన్స్‌కు ఆమోదం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఆదేశాలు, సుప్రీం కోర్టు తీర్పుల నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై మంత్రివర్గం ఆలోచన చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పాత విధానంతో జరపాలా లేక కొత్త రిజర్వేషన్ విధానంతో ముందుకెళ్లాలా అనేది కూడా చర్చనీయాంశం. ఈ అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కమిటీ నివేదిక ఆధారంగా న్యాయస్థానాల్లో వాదనలు సిద్ధం చేస్తోంది.

ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్సుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతోపాటు, SLBC పునరుద్ధరణ పనులు, SRSP రెండో దశలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పేరిట ప్రాజెక్టు, కాళేశ్వరం పునరుద్ధరణ వంటి పెద్ద ప్రాజెక్టులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉందని వర్గాలు చెబుతున్నాయి. ఏ పథకాన్ని అమలు చేస్తారో ఇంకా స్పష్టత లేదు. రేపు సమావేశం నుంచి ఈ అంశాలపై కీలక ప్రకటనలు రానున్నాయని, ప్రజలు ఆశభరితంగా ఉన్నారని తెలుస్తోంది.

Tags: