TPCC Extended Executive Meeting: తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ రోజు ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్, కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్‌లు కూడా హాజరవుతారు.

సమావేశంలో ప్రధానంగా కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీల (డీసీసీ) అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియామక పత్రాలు పంచనున్నారు. మునుపటి డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సన్మానం చేస్తారు. డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశాలు ఇస్తారు.

అంతేకాకుండా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమాలు వంటి కీలక అంశాలపై వివరణాత్మక చర్చ జరుగనుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత గ్రామ, మండల స్థాయిలో పార్టీని మరింత బలపరచే ప్రణాళికలు ఈ సమావేశంలో ఆమోదం పొందనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ మరింత శక్తివంతంగా మారనుందని, ప్రజల సంక్షేమానికి మరింత దృష్టి పెట్టనున్నట్లు నాయకులు అంచనా వేస్తున్నారు.

Tags: