Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

అంతకుముందు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు పవన్ కల్యాణ్. పిఠాపురం రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా, భక్తి ప్రధాన పట్టణమని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

అలాగే, సేతు భవన్ పథకం కింద మంజూరైన రోడ్డు ఓవర్ బ్రిడ్జ్‌ను పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది 2030 జాతీయ రైలు ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగ్‌లను తొలగించడానికి, ట్రాఫిక్ నియంత్రణకు దోహదపడుతుందని వివరించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగింది.

అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినందుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలు రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల పెంపుకు దోహదపడతాయని భావిస్తున్నారు.

Tags: