సీఎం చంద్రబాబు అధ్యక్షతలో 3.5 గంటలు సాగిన సమావేశం

70 అజెండాలపై చర్చ.. పరిశ్రమలకు భూరాయితీలు, మొంథా తుపాను స్పందనకు మంత్రుల అభినందం

పేదలకు ఇళ్లు.. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేర్చండి

అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ, సంస్థలకు భూముల కేటాయింపు

AP Cabinet Meeting Concludes:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శనివారం ముగిసింది. మూడున్నర గంటలపాటు సాగిన ఈ భేటీలో సుమారు 70 అజెండా అంశాలపై విస్తృత చర్చ నిర్వహించారు. అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సీఆర్డీఏ తీసుకున్న భూముల కేటాయింపు నిర్ణయాలు, వివిధ పరిశ్రమలకు భూరాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సమావేశంలో అజెండాలపై చర్చించిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సహాయం అందించారని అభినందించారు. అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని, ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలిగామని సీఎం పేర్కొన్నారు. ‘‘సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయి. అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశాను’’ అని మంత్రులను కొనియాడారు.

పేదలకు ఇళ్లు.. పథకాల ప్రచారం

పేదలందరికీ ఇళ్లు కేటాయించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేని ప్రజల జాబితా రూపొందించి, అందరికీ దక్కేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని చెప్పారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారం

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తప్పని సీఎం హెచ్చరించారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు సరైన విధానం రూపొందించాలని, అధికారులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంతో ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

Tags: