AP CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan Conclude Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య జరిగిన కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో తాజాగా ఉన్న రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష వైకాపా చేస్తున్న కుట్రలు తదితర అంశాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు.

వైకాపా కుల రాజకీయాలను రెచ్చగొడుతూ, సంకీర్ణ వ్యూహాలతో ముందుకు వస్తోందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఏర్పాటు చేస్తున్న ట్రాప్‌లలో పడకుండా ఉండటానికి, ఆ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులపై లోతుగా చర్చ జరిగింది.

కిందిస్థాయిలో తెలుగుదేశం పార్టీ (తెదేపా), జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు, చిచ్చు పెట్టేలా వైకాపా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

అదే విధంగా త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలపై ప్రాథమిక చర్చ జరిగింది. పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ విషయంపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వంలోని కూటమి బలోపేతానికి, ప్రతిపక్ష కుట్రలను తిప్పికొట్టడానికి మరింత బలం చేకూర్చినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags: