CM Chandrababu Questions: గొడ్డలి పట్టుకునే చేతులకు రైతుల బాధలు గుర్తొస్తాయా? : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు
CM Chandrababu Questions: రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు, దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నట్లు తెలిపారు.
పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ‘మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా భూముల సర్వే చేపట్టినట్లు వివరించారు. ఎవరైనా హ్యాక్ చేసినా వెంటనే గుర్తించవచ్చని, రైతుల సమక్షంలో సర్వే చేసి ఈకేవైసీ తీసుకున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి, 26.46 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు అందించినట్లు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించి 16,500 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, ఎన్ని కుట్రలు చేసినా ఒక ఏడాదిలోనే ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు.
గొడ్డలి పార్టీపై తీవ్ర విమర్శలు:
గొడ్డలి పార్టీ చేసేవన్నీ తప్పుడు ప్రచారాలేనని, నేరాలు-ఘోరాలు వారే చేసి ఇతరులపై వేస్తున్నారని ఆరోపించారు. బాబాయ్ను చంపి గుండెపోటుగా చిత్రీకరించినట్లు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి రూ.1,500 కోట్ల ఆస్తులు కొల్లగొట్టినట్లు ఆయన ఆరోపించారు. గొడ్డలి పార్టీ నేతలు తెలంగాణలో కూడా రికార్డులు తారుమారు చేస్తున్నారని విమర్శించారు.
రైతుల బాధలు గుర్తించని వారిపై మండిపడ్డారు:
“గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతుల బాధలు గుర్తుకురావు. కోడికత్తి డ్రామాలాడేవారికి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చేవారికి సాగు తెలియదు. ఆలయాలపై దాడి చేసేవాళ్లకు ప్రజల మనోభావాలు తెలియవు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించాలని చూశారు. ఈ జన్మలోనే ఆ దేవుడు వారిని శిక్షిస్తాడు” అని చంద్రబాబు హెచ్చరించారు.
ఈ కార్యక్రమం రైతుల భూమి హక్కులను భద్రపరచడంతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అని సీఎం పేర్కొన్నారు.