CM Chandrababu Instructs: మహానాడులో కార్యకర్తలకు పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు సూచనలు
సీఎం చంద్రబాబు సూచనలు
CM Chandrababu Instructs: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పొలిట్బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చించారు. మహానాడు విజయవంతం కావాలంటే పార్టీ కార్యకర్తల స్ఫూర్తి, సంకల్పం ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ, “కార్యకర్తే అధినేత” అనే సందేశం మహానాడు వేదికపై స్పష్టంగా కనిపించాలన్నారు. మహిళలకు తెదేపా ఇచ్చే ప్రాధాన్యత అందరికీ అర్థమయ్యే విధంగా చాటాలని, సంప్రదాయ ఓట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.
జనాభాలో సుమారు 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, వారి సర్వతోముఖ అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉందనే సందేశం మహానాడు ద్వారా బలంగా వెళ్లాలని ఆయన అన్నారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును అద్భుతంగా విజయవంతం చేయాలని, ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంపై సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని చంద్రబాబు నిర్దేశించారు.
ఈ సమావేశంలో మహానాడులో ప్రవేశపెట్టబోయే 19 తీర్మానాలకు పొలిట్బ్యూరో ఆమోదం తెలిపింది.
ఈ మహానాడు ద్వారా పార్టీలోని కార్యకర్తల శక్తిని, ప్రజలతో తెదేపా సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.