Government of Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ పెట్టుబడి అవకాశం వెలువడింది. దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆహ్వానానికి స్పందించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.

ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు, ఆహార శుద్ధి రంగంలో వాల్యూ చైన్ అభివృద్ధి చేయడంపై విస్తృత చర్చ జరిగింది.

దావోస్‌లో కుదిరిన ఈ కీలక ఒప్పందం ఇప్పుడు ఆచరణలోకి వస్తోంది. ఏపీలో మామిడి, అరటి, కోకోతో పాటు వివిధ ఉద్యానవన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా వాల్యూ చైన్‌ను ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ రంగం బలపడి, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

సమావేశంలో యూఏఈ ప్రతినిధులతో పాటు మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (EDB) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చడంలో ముఖ్యమైన మైలురాయి అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: