Third World Telugu Maha Sabha in Guntur: తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను ప్రపంచవ్యాప్తంగా కీర్తించే మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనలతో సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రలు ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు.

ప్రధాన వేదిక సమీపంలో రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష యొక్క ప్రాచీనత్వాన్ని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పురాతన సాహిత్య గ్రంథాలు, చారిత్రక నాణేలు, ఆంధ్ర సంప్రదాయ వంటకాల ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగనున్న ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల వేడుకకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్. మానవేంద్రనాథ్ రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందూ పరిషత్ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తెలుగు మన మమకార భాష

ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మహాసభలకు అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ, ‘‘తెలుగు భాష ప్రభుత్వాలకు అధికార భాష కావచ్చు, కానీ మనకు అది మమకార భాష. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మూడోసారి ఈ ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నాం. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన భాష తెలుగు. నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగుకు పట్టం కట్టారు. ఎన్టీఆర్, రామోజీరావులు తెలుగు భాషకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన మహానుభావులు’’ అని కొనియాడారు.

ఈ మహాసభలు తెలుగు ప్రజల అనురాగ సంగమంగా మారనున్నాయి.

Tags: