Minister Nimmala Ramanaidu: జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ప్రయోజనం చేకూరుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి పాల్గొన్న ఆయన, రైతులతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిమ్మల రామానాయుడు, జీఎస్టీ తగ్గింపు వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభపడుతున్నారని, వ్యవసాయ యంత్రాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని ఆయన తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రైతులకు రూ.7 వేలు జమ చేశామని, గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,640 కోట్ల ధాన్య బకాయిలను కూటమి ప్రభుత్వం కట్టుకట్టి చెల్లించిందని చెప్పారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే నగదు చెల్లింపులు చేశామని, 80 శాతం రాయితీపై విత్తనాలు అందించామని ఆయన పేర్కొన్నారు.

జగన్ పాలనలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసివేసి రైతులను మోసం చేశారని నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసి, రైతుల అభివృద్ధిని దెబ్బతీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, మరిన్ని ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Tags: