మంగళగిరి బస్టాండ్‌లో ఘనంగా లాంచ్.. దివ్యాంగులతో కలిసి బస్సు ప్రయాణం

N. Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని లాంచ్ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు.

డాన్‌బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వరకు బస్సు ప్రయాణం చేశారు. ప్రయాణం సమయంలో సీఎం చంద్రబాబు దివ్యాంగులతో మాట్లాడి, వారి బాగోగులు, సమస్యలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు.

‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మరో ముఖ్యమైన పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళగిరి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు తరలివచ్చి సీఎంతో పాటు దివ్యాంగులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం దివ్యాంగులలో బాగా స్పందన కలిగించింది.

Tags: