N. Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే సాధారణ సరఫరా కొనసాగించాలని అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో అధికారులు సీఎం కు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల సరఫరా ఒత్తిడి పెరిగిందని వివరించారు. వ్యాపార వినియోగదారులు పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయడం, అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు సరఫరా తగ్గించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగి “నో స్టాక్” బోర్డులు కనిపించాయి. దీనితో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రభుత్వం ఈ సమస్య తాత్కాలికమేనని స్పష్టం చేసింది.

సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని, అవసరమైన ఇంధనాన్ని వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.

అదేవిధంగా ఆయిల్ కంపెనీలు సరఫరా వ్యవస్థను నిరంతరంగా కొనసాగించాలి అని హెచ్చరించారు. అవసరమైతే విచారణ జరిపి సమస్యల మూల కారణాలను గుర్తించాలని కూడా ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: