Nara Brahmani: నారా బ్రాహ్మణికి అంతర్జాతీయ గౌరవం: ఫార్చ్యూన్ ఇండియా ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026’ జాబితాలో స్థానం
జాబితాలో స్థానం
Nara Brahmani: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫార్చ్యూన్ ఇండియా’ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్’ జాబితాలో ఆమె చోటు సంపాదించారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా పని చేస్తున్న ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా బ్రాహ్మణి నిలవడం విశేషం.
దిల్లీలో జరిగిన ‘ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026’ సదస్సులో ఈ గౌరవాన్ని బ్రాహ్మణికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హెరిటేజ్ ఫుడ్స్ ప్రయాణంలో రైతుల పాత్ర అత్యంత కీలకమని, పాల ఉత్పత్తి రంగంలో నూతన సాంకేతికతలను అమలు చేస్తూనే అన్నదాతల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ అరుదైన గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబం, రైతులు మరియు సంస్థ ఉద్యోగులందరికీ అంకితం చేస్తున్నట్లు బ్రాహ్మణి ప్రకటించారు.
భార్య సాధించిన ఈ ఘనతపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన దేశంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మహిళల జాబితాలో బ్రాహ్మణి నిలవడం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని లోకేశ్ తెలిపారు. ఇలాంటి ప్రతిభను మరింత చాటుతూ, నాయకత్వ లక్షణాలతో మరిన్ని సవాళ్లను అధిగమించాలని ఆమెను ఆశీర్వదించారు.