Clarifies AP Fact Check: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత వార్తలు అవాస్తవం – ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం
ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం
గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు చివరి దశలో
అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దీర్ఘకాలిక ప్రాజెక్టు - రెండు విమానాశ్రయాలు కలిసి కొనసాగతాయి
Clarifies AP Fact Check: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేస్తారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ఖండించింది. ఇలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రూ.611.80 కోట్ల వ్యయంతో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (NITB) నిర్మాణం చివరి దశలో ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రారంభించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి.
అమరావతి ఎయిర్పోర్ట్ గురించి...
అమరావతి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్టు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామం సమీపంలో సుమారు 4,618 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త విమానాశ్రయం ఏర్పాటు కోసం పనులు ముందుకు సాగుతున్నాయి. భవిష్యత్తులో అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా, విమానాల మరమ్మతు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.
అయితే, ఈ కొత్త విమానాశ్రయం వచ్చినా విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం యథావిధిగా తన సేవలు కొనసాగిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు సాధారణంగా ఉంటాయని, అదే విధంగా అమరావతి ప్రాంతంలోనూ రెండు విమానాశ్రయాలు కలిసి పని చేస్తాయని వివరించింది.