CM Chandrababu: ఏపీలో కోటి ఎంఎస్ఎంఈలు స్థాపించాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu: దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రంగం యువత కలలను సాకారం చేసే వేదిక అని పేర్కొన్నారు.
విజయవాడలోని డాక్టర్ అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాల్లను సందర్శించి, స్టార్టప్ సంస్థలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం రాష్ట్రంలోని 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలు అని చెప్పారు. మహిళా ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి చేర్చడంలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం అన్నారు.
‘‘ఎంఎస్ఎంఈలు సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా మారాలి. రాష్ట్రంలో ఒక కోటి ఎంఎస్ఎంఈలు స్థాపించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి యువత సృజనాత్మకతకు వేదికలుగా మారాలి’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఈ సమ్మిట్ ద్వారా అనేక ఒప్పందాలు కుదిరాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంఎస్ఎంఈ రంగం కీలకం అని సీఎం తెలిపారు.