Stolen Car Racket Creates Panic Among Police: దొంగతనంగా తెలంగాణ నుంచి అపహరించిన కార్లను పల్నాడు జిల్లాలో తక్కువ ధరకు అమ్మిన వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు, కొందరు రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ ముఠా నేత వెంకటనాయుడు కుమారుడితో సన్నిహితంగా ఉన్న ఓ ఏఎస్సై కారణంగా ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. సస్పెండ్ అయిన ఎస్సై రహంతుల్లా వద్ద నాలుగు దొంగ కార్లు ఉన్నట్టు గుర్తించారు. గుంటూరులోని ఓ షెడ్‌లో మరో తొమ్మిది కార్లు విక్రయానికి సిద్ధంగా ఉంచినట్టు సమాచారం.

వెంకటనాయుడు ముఠా సభ్యులైన భాను, అంజిలు సహా ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ముఠా సుమారు వందల కార్లను తెలంగాణలో దొంగిలించి, పల్నాడు జిల్లాలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధుల సన్నిహితులకు చౌకగా అమ్మినట్టు విచారణలో తేలింది. ఫాస్ట్‌ట్యాగ్‌లు ఏర్పాటు చేసుకుని టోల్ గేట్ల ద్వారా తిరిగిన ఆధారాలు కూడా పోలీసులకు లభించాయి.

ఈ ఘటనతో పలువురు పోలీసు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది. వ్యవహారం బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఏఎస్సైని వెల్దుర్తి స్టేషన్‌కు బదిలీ చేసినా, తండ్రి పాత్రపై విచారణ జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

పూర్తి వివరాలు వెల్లడయ్యేందుకు సిట్ లేదా సీఐడీ దర్యాప్తు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు ప్రమాదం కేసుతో ఈ వ్యవహారం ముగిసిపోతుందని కొందరు ఆశిస్తున్నారు. అయితే, ఇప్పటికే స్వాధీనం చేసుకున్న కార్లు, దొరకని నిందితులు ఈ కేసును మరింత లోతుగా విచారించేలా చేస్తున్నాయి.

Tags: