మిద్దెతోటల మహిళలకు అవార్డులు.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం

Union Minister Pemmasani Chandrasekhar: వ్యవసాయం చేసే చాలా మంది రైతులకు సరైన ఆదాయం రావట్లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా ఎక్కువ పంటలు వేయాలని సూచించారు. మార్కెట్‌ డిమాండ్‌ను అర్థం చేసుకుని పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతు నేస్తం ఫౌండేషన్‌ 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు అవార్డులు అందజేశారు. మిద్దెతోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న రఘోత్తమరెడ్డి, వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

‘‘వ్యవసాయంతో సరిపెట్టకుండా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే ఎక్కువ లబ్ధి జరుగుతుంది. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుంది’’ అని పెమ్మసాని పేర్కొన్నారు. సీఎం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని, మిద్దెతోటలకు బడ్జెట్‌లో కేటాయింపు చేయడంపై ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతు నేస్తం ఫౌండేషన్‌ సంస్థాపకులు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం, స్థిరమైన ఆదాయ మార్గాలపై చర్చలు జరిగాయి.

Tags: