Railways Plans Mega Rail Terminals: రాజధాని అమరావతి, గన్నవరంలో మెగా రైలు టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సవివర ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తులో అమరావతి రైల్వే నెట్‌వర్క్‌లో భారీ రైలు రాకపోకలు జరిగేందుకు 8 ప్లాట్‌ఫామ్‌లతో కూడిన టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ, శుభ్రత వంటి పనులకు సంపూర్ణ సౌకర్యాలు కల్పిస్తారు. అదే సమయంలో విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు గన్నవరం టెర్మినల్‌ను డెవలప్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులతో పాటు విజయవాడ, గుంటూరు ప్రధాన స్టేషన్‌ల విస్తరణలు చేపట్టి, మరిన్ని రైళ్ల రాకపోకలకు అవకాశం కల్పిస్తారు.

అమరావతి టెర్మినల్‌లో 120 రైళ్ల సామర్థ్యం

ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు.

అమరావతి ప్రధాన స్టేషన్‌ను మెగా కోచింగ్ టెర్మినల్‌గా మార్చనున్నారు, ఇక్కడ రైళ్లు ఆగినా లేదా బయలుదేరినా కోచ్‌ల నిర్వహణ పనులు జరుగుతాయి.

8 రైల్వే లైన్‌లు, 8 ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేస్తారు; ప్రతి ప్లాట్‌ఫామ్‌లో 24 LHB కోచ్‌లతో కూడిన రైళ్లు నిలవగలవు.

భవిష్యత్తులో 120 రైళ్ల రాకపోకలకు సమర్థవంతంగా పనిచేసేలా డిజైన్ చేస్తారు.

రైళ్ల నిర్వహణకు 6 పిట్ లైన్‌లు నిర్మిస్తారు, వీటిలో ఒకటి వందేభారత్ రైలు కోసం ప్రత్యేకంగా ఉంటుంది.

ఈ ప్రాజెక్టుకు 300 ఎకరాల భూమి అవసరమని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖ కోరింది.

10 ప్లాట్‌ఫామ్‌లతో గన్నవరం మెగా టెర్మినల్

గన్నవరం స్టేషన్‌ను మెగా కోచింగ్ టెర్మినల్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు.

ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్‌లతో పరిమిత రైళ్లు మాత్రమే ఆగుతున్న ఈ స్టేషన్‌ను విజయవాడకు ప్రత్యామ్నాయంగా మారుస్తారు.

సికింద్రాబాద్ స్టేషన్ ఒత్తిడిని తగ్గించినట్లే, గన్నవరం టెర్మినల్ విజయవాడ ఒత్తిడిని తగ్గిస్తుంది.

10 రైల్వే లైన్‌లు, 10 ప్లాట్‌ఫామ్‌లను నిర్మించి, 205 రైళ్ల రాకపోకలకు సామర్థ్యం కల్పిస్తారు.

కోచ్‌ల నిర్వహణకు 4 పిట్ లైన్‌లు ఏర్పాటు చేస్తారు.

ఈ టెర్మినల్‌కు 143 ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్రాన్ని కోరారు.

విజయవాడ స్టేషన్ విస్తరణతో 300 రైళ్ల సామర్థ్యం

ప్రస్తుతం రోజుకు 200 రైళ్లు ప్రవేశించే విజయవాడ స్టేషన్‌ను 300 రైళ్ల సామర్థ్యానికి పెంచుతారు.

1, 2, 3 లైన్‌లను విస్తరించి, 28 LHB లేదా 24 ICF కోచ్‌లతో కూడిన రైళ్లు 2, 3, 4 ప్లాట్‌ఫామ్‌లలో సౌకర్యవంతంగా నిలవగలవు.

రిసెప్షన్ సిగ్నల్ నుంచి స్టేషన్‌లోకి రైళ్ల వేగాన్ని గంటకు 15 కి.మీ. నుంచి 40-50 కి.మీ.కి పెంచుతారు.

గుంటూరు స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం

గుంటూరు స్టేషన్‌లోని 7 ప్లాట్‌ఫామ్‌లకు ఇంకోటి ఒకటి చేర్చి, 120 రైళ్ల నుంచి 170 రైళ్ల సామర్థ్యానికి అభివృద్ధి చేస్తారు.

Tags: