AP Assembly Staff: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిబ్బంది వ్యవహార శైలిపై విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినప్పటికీ, అసెంబ్లీ సిబ్బంది గత వైసీపీ ప్రభుత్వ పథకాల పేర్లను ఉపయోగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలు:

సెప్టెంబరు 18న ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో, వైసీపీ హయాంలోని ‘డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ పథకం పేరును ఉపయోగించారు. కానీ, కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ‘డా. ఎన్టీఆర్ వైద్య సేవ’గా మార్చిన విషయం అసెంబ్లీ సచివాలయం గుర్తించలేదు. శాసనసభ ప్రశ్నోత్తరాలలో రెండు ప్రశ్నల్లో ‘ఆరోగ్యశ్రీ’ అని పదే పదే ప్రస్తావించడంతో, సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమైందని పలువురు నిరసన వ్యక్తం చేశారు.

మంత్రి నారా లోకేష్ ఆగ్రహం:

అదే రోజు, అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతి ప్రవర్తనపై రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చాంబర్ నుంచి బయటకు వస్తుండగా, మార్షల్స్ ‘తప్పుకోండి’ అంటూ హడావుడి చేశారు. దీనిపై స్పందించిన లోకేష్, “సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని? తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు. బయటి వ్యక్తులు లోపలకు రాకుండా చూసుకోవాలే తప్ప, ఎమ్మెల్యేల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మార్షల్స్‌కు హితవు పలికారు.

ఈ సంఘటనలు అసెంబ్లీ సిబ్బంది వ్యవహార శైలిపై చర్చను రేకెత్తించాయి, ప్రభుత్వం మారినా పాత అలవాట్లు మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags: