Telugu Desam Party (TDP): తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తెలుగుదేశం పార్టీ (తెదేపా) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలో జరిగిన ఈ సమావేశంలో, కొలికపూడి ప్రవర్తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా ఆయనకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లేకుండా వ్యక్తిగతంగా శూన్యమేనని గుర్తుంచుకోవాలని, పార్టీ క్రమశిక్షణకు లోబడి ప్రవర్తించాలని ఆయన హితవు చెప్పారు. పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే ముఖ్యమంత్రి నిశ్శబ్దంగా చూస్తూ ఉండరని స్పష్టం చేశారు.

కొలికపూడి ఎన్నిసార్లు మందలించినా తన పద్ధతిని మార్చుకోకుండా తప్పులు చేస్తూ పోతే, పార్టీ ఆయనను ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని పల్లా శ్రీనివాస్‌ హెచ్చరించారు. వాట్సాప్‌లో పిచ్చి స్టేటస్‌లు పెట్టి ఎవరిపై పోరాడుతున్నారని ఆయన నిలదీశారు. దీనికి కొలికపూడి తన అనుభవరాహిత్యం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. సీనియర్‌ నాయకులు తనకు మార్గదర్శకత్వం చేయాలని కోరారు.

Tags: