Visakhapatnam Steel Plant Accident: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనలో 8 మంది మృతి చెందడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఒక్కరికి ఉద్యోగం అందించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. రక్షణ చర్యల్లో యాజమాన్యం వైఫల్యం ఉందా అని పూర్తిగా పరిశీలిస్తాం. ప్రమాదం కారణాలను విచారించడానికి కమిటీ నియమించి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. ఒక కోణం నుంచి కాకుండా అన్ని వైపులా వివరాలు సేకరించి నిజం తెలుసుకుంటాం” అని అన్నారు.

“ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు కేవలం బాధపడటం సరిపోదు. ఇకపై పునరావృతం కాకుండా చూడాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు. ప్రభుత్వ స్టీల్ ప్లాంట్‌గానే కొనసాగాలనేది అందరి ఆకాంక్ష. దానిని మేము నిలబెడతాం. కార్మికుల సమస్యలను వారి నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తాం. త్వరలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేస్తాం” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కార్మికులు మరియు బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తాయని భావిస్తున్నారు.

Tags: