Visakhapatnam Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం: బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం - మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్

Update: 2026-06-09 12:08 GMT

Visakhapatnam Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా, 6 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను మంత్రి లోకేశ్‌తో పాటు మంత్రులు అనిత, సంధ్యారాణి, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీ శ్రీభరత్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు.

ప్రమాద వివరాలను బాధిత కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్న మంత్రి లోకేశ్ వారికి ధైర్యం చెప్పి, భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. కేంద్రమంత్రి కుమారస్వామి అదనంగా రూ.25 లక్షలు ప్రకటించారని గుర్తు చేశారు.

తన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ లోకేశ్, “ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్రమంత్రి వచ్చి పరిశీలించారు. లోపం ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలుసుకుని చర్యలు తీసుకుంటాం. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు ఉంటాయి” అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకున్నట్లే ఉత్పత్తి కూడా తిరిగి ప్రారంభించామని, ఇక ముందు కూడా అలాగే కాపాడుకుంటామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బాధితులకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయని, అందరూ ఐక్యంగా ఉండాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News