TTD : విలువైన టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు ఇస్తున్నారు
టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడిని ప్రశ్నించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి;
తిరుమల తిరుపతి దేవస్ధానానికి చెందిన అత్యంత విలువైన భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడిని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కరుణాకర్రెడ్డి తాను అడిగిన ప్రశ్నలకు బీఆర్నాయుడు ఇప్పటికీ సమాధానం చెప్పలేదని అన్నారు. పైగా విలువైన టీటీడీ భూములు పర్యాటక శాఖకు ఎందుకు కేటాయించారని అడిగినందుకు బూతులు తిడుతున్నారని విమర్శించారు. బీఆర్నాయుడులాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండటం హిందువుల దురదృష్టమని భూమన వ్యాఖ్యానించారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటన్నాయన్నారు. తప్పుడు ప్రచారాలకు బీఆర్నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని పైరవీకారుడు, దోపిడీదారుడు అయిన బీఆర్నాయుడు వంటి వ్యక్తుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. నాపై చేస్తున్న ఆరోపణలకు సీబీఐతో విచారణకు నేను సిద్దమని భూమన ప్రకటించారు. జూబ్లీహిల్స్ సొసైటీలో బీఆర్నాయుడు అనేక అక్రమాలు చేశారని భూమన ఆరోపించారు. బీఆర్నాయుడి అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. టీటీడీ పదవిని అడ్డుపెట్టుకుని బీఆర్నాయుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. క్విడ్ ప్రోకో కింద బీఆర్నాయుడికి ఆ పదవి వచ్చిందని, అది శాశ్వతం కాదనే విషయం బీఆర్నాయుడు గుర్తుంచుకోవాలని భూమన కరుణాకర్రెడ్డి అన్నారు.