Investments in Visakhapatnam : ఏపీ ఆర్థిక రాజధాని విశాఖకు పెట్టుబడుల వరద
50వేల ఉద్యోగాలు కల్పించే 20,216కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం;
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విశాఖ మహానగర రూపురేఖలు మారబోతున్నాయి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన 9వ ఎస్ఐపిబి (స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఐటి రంగంలో 20,216కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటి హబ్ గా రూపుదిద్దుకోనుంది. ఇటీవల మంత్రి లోకేష్ బెంగుళూరు పర్యటన సందర్భంగా 35వేల ఉద్యోగాలు కల్పించే రెండు ప్రముఖ సంస్థలతో ఒకేరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ రెండు సంస్థలకు తాజాగా జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో పచ్చజెండా ఊపారు. ఆరోజున ఎంఓయులు కుదుర్చుకున్న సత్వ డెవలపర్స్ సంస్థ విశాఖ మధురవాడలో రూ.1500 కోట్ల పెట్టుబడులు, 25వేల ఉద్యోగాలు, ఎఎన్ఎస్ఆర్ సంస్థ రూ.1000కోట్ల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి)ని ఏర్పాటుచేయడం ద్వారా 10వేలమంది ఉద్యోవగాశాలు కల్పించనుంది.
అదేవిధంగా ఎస్ఐపిబి ఆమోదించిన మరో ప్రముఖ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో డాటా సెంటర్ పై మొదటిదశలో రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనిద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవదశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు... 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇదిలావుండగా విశాఖ ఎండాడలో బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1250కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుచేయబోతోంది. తాజా ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం పొందిన ఈ సంస్థ ద్వారా 15వేలమందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ప్రఖ్యాత ఐటి సంస్థలైన టిసిఎస్ (12వేల ఉద్యోగాలు), కాగ్నిజెంట్ (రూ.1583కోట్ల పెట్టుబడి, 8వేల ఉద్యోగాలు) త్వరలో విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత ఏడాది కాలంగా మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషితో రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జిసిసి), డాటాసెంటర్ల పై లక్షకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు, 95 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. గత ఏడాది నవంబర్ లో లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర, జనవరిలో దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో యువనేత జరిపిన చర్చలు ఫలవంతమై రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అయిదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని సాకారం చేసేందుకు... పెట్టుబడులు, ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయి.