IPO : దేశంలో 5వ అతిపెద్ద ఐపీఓగా LG ఇండియా.. 15% వాటా విక్రయానికి సిద్ధం!
15% వాటా విక్రయానికి సిద్ధం!;
IPO : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG ఎలక్ట్రానిక్స్ భారత్లో తన రాబోయే ఐపీఓ గురించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. కంపెనీ ఇటీవల స్పష్టం చేసిన దాని ప్రకారం, LG ఇండియా యూనిట్లో 15% వాటాను విక్రయించే ప్రణాళిక సిద్ధంగా ఉంది. అయితే, ఈ వాటా ధరను రాబోయే 6 నెలల్లోపు నిర్ణయిస్తామని కంపెనీ తెలిపింది. లిస్టింగ్ నిర్ణయం పూర్తిగా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ అంచనాలపై ఆధారపడి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది దేశంలో 5వ అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.
మార్చి 2025లో SEBI ఆమోదం
భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మార్చి 2025లో ఈ ఐపీఓకు ఆమోదం తెలిపింది. అయితే, ఆ వెంటనే మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా లిస్టింగ్ను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం, ఐపీఓ ప్రారంభానికి సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన తేదీని నిర్ణయించలేదని కంపెనీ స్పష్టం చేసింది.
ఐపీఓ ఎప్పుడు వస్తుంది?
LG ఎలక్ట్రానిక్స్ కొరియా మాతృసంస్థ సీఎఫ్ఓ (CFO) కిమ్ చాంగ్ టే మాట్లాడుతూ.. "మా బిజినెస్ పర్ఫామెన్స్, ఫినాన్షియల్ స్ట్రక్చర్ పరిశీలిస్తే, ఐపీఓను త్వరగా తీసుకురావాల్సిన ఒత్తిడి మాపై లేదు" అని అన్నారు. అంతిమ నిర్ణయం రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత మార్కెట్లో సరైన విలువను (Valuation) నిర్ధారించుకోవడం. ఐపీఓ ప్రారంభానికి సరైన సమయాన్ని ప్రణాళిక చేసుకోవడం.
షేర్ విక్రయానికి సంబంధించిన పూర్తి వివరాలను 6 నెలల్లోపు వెల్లడిస్తామని కంపెనీ గత గురువారం మరోసారి పునరుద్ఘాటించింది. LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అంచనా విలువ సుమారు 12.5 బిలియన్ డాలర్లు ఉండవచ్చు. ఫిబ్రవరిలో కంపెనీ ఈ ఐపీఓ ప్రక్రియను ప్రారంభించింది. LG ఇండియా దేశంలో రెండవ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ. దీని ప్రధాన పోటీదారులు హ్యవెల్స్ ఇండియా (Havells India), వోల్టాస్ (Voltas), విర్ల్పూల్ ఆఫ్ ఇండియా (Whirlpool of India), బ్లూ స్టార్ (Blue Star) వంటివి ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఒకవేళ LG ఇండియా ఐపీఓ లిస్ట్ అయితే, అది హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తర్వాత భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన రెండవ దక్షిణ కొరియా కంపెనీ అవుతుంది.