Samantha: నిర్మాతగా మారడం అంత ఈజీ కాదు.. సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. 'మా ఇంటి బంగారం' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ క్రేజీ మూవీ, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు దేవా కట్టా, డీకే, రాహుల్ రవీంద్రన్తో పాటు అగ్ర నిర్మాతలు డి.సురేశ్ బాబు, వై. రవిశంకర్, స్వప్న దత్ అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "ఈ సినిమాతో కచ్చితంగా ప్రతి ఒక్కరినీ నా ప్రేమతో కొడతాను. దీన్ని మేమంతా అంత ఇష్టపడి చేశాం. ఇప్పటి వరకు నటిగా నా కెరీర్ చాలా సాఫీగా సాగిపోయింది.. కానీ, ఒక నటిగా ఉంటూనే, నిర్మాతగా మారడంలో ఉన్న కష్టమేంటన్నది గత నాలుగైదు రోజులుగా నాకు అర్థమవుతోంది" అంటూ సమంత చెప్పుకొచ్చింది.అంతేకాదు, ఈ సినిమాలో తను చీర కట్టుకుని చేసిన ఫైట్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని సామ్ తెలిపింది. చీరలో యాక్షన్ సీన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ.. స్క్రీన్ మీద ఆ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయని ధీమా వ్యక్తం చేసింది. సినిమాలో డైలాగ్స్ చాలా సహజంగా ఉండటం వల్లే తను ఇంత బాగా నటించగలిగానని తెలిపింది.
మరోవైపు దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. "నా కెరీర్లోనే ఈ సినిమా కోసం పడినంత కష్టం ఏ చిత్రానికి పడలేదు. అందరం కలిసి కష్టపడి కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేశాం. సమంత, రాజ్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని నమ్ముతున్నాను. ఈ నెల 19న మీకు నచ్చిన సామ్ను స్క్రీన్ మీద పది రెట్లు అద్భుతంగా చూస్తారు" అంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు.