Actor Rajpal Yadav: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష..

జైలు శిక్ష..

Update: 2026-07-11 02:14 GMT

Actor Rajpal Yadav: తనదైన కామెడీ టైమింగ్‌తో బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్నేళ్లుగా ఆయన్ను వెంటాడుతున్న 'చెక్ బౌన్స్' కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది.

ఈ కేసులో రాజ్‌పాల్ యాదవ్‌తో పాటు ఆయన భార్య రాధా యాదవ్‌కు గతంలో ట్రయల్ కోర్టు విధించిన మూడు నెలల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. జస్టిస్ సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే.. రాజ్‌పాల్ యాదవ్ 2010లో 'అతా పతా లపతా' అనే సినిమాతో దర్శకుడిగా మారాలని అనుకున్నారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ నుంచి ఆయన దాదాపు 5 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు.

అయితే ఆ తర్వాత ఆ అప్పును తిరిగి చెల్లించడంలో రాజ్‌పాల్ యాదవ్ విఫలమయ్యారు. తీసుకున్న అప్పును తీర్చడానికి ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. దీంతో సదరు లీగల్ కంపెనీ రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్యపై కోర్టులో కేసు దాఖలు చేసింది.

ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. రాజ్‌పాల్ యాదవ్ కావాలనే అప్పు తీర్చకుండా కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా కోర్టు ముందు ఇచ్చిన హామీలను ఆయన నిలబెట్టుకోలేదని ధర్మాసనం గుర్తు చేసింది. చట్టం ముందు ఎవరైనా సమానులే అని స్పష్టం చేస్తూ.. ట్రయల్ కోర్టు విధించిన 3 నెలల జైలు శిక్షను అమలు చేయాలని ఆదేశించింది.

వెండితెరపై ఎప్పుడూ నవ్వులు పూయించే ఒక స్టార్ కమెడియన్.. ఇలా అప్పుల వివాదంలో చిక్కుకుని జైలు శిక్ష పడే వరకు తెచ్చుకోవడం ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News