Couple Friendly Set for OTT Release: గత నెల వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం "కపుల్ ఫ్రెండ్లీ". సరికొత్త కథనం మరియు హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ హీరో సంతోష్ శోభన్, ఈ సినిమాతో తన వరుస పరాజయాలకు బ్రేక్ వేసి మంచి విజయాన్ని అందుకున్నారు. హీరోయిన్ మానస వారణాసి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించకపోయినా, సంతోష్ శోభన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ సినిమా ప్రమోషన్లలో ప్రభాస్ పాల్గొనడం విశేషం. తన సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌కు మద్దతు తెలపడమే కాకుండా, సంతోష్ శోభన్ మరియు మానసలతో కలిసి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన సరిగ్గా నెల రోజులకు, అంటే మార్చి 13 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో "కపుల్ ఫ్రెండ్లీ" స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా తేదీని ఖరారు చేసింది. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు హాయిగా ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశం దొరికింది.

Tags: