Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు
మరోసారి ఈడీ నోటీసులు;
Vijay Deverakonda: నటుడు విజయ్ దేవరకొండకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈసారి నోటీసులు చట్టవిరుద్ధ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా అందినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11న విచారణకు రావాలని ఆదేశించింది. అనేక మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయల మేర అక్రమ నగదు లావాదేవీలు (మనీలాండరింగ్) జరుగుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు సినీ తారలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి వారికి కూడా ఈడీ నోటీసులు పంపింది. రానాను జూలై 23న, ప్రకాష్ రాజ్ను జూలై 30న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు పిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో నమోదైన కనీసం ఐదు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 'జంగ్లీ రమ్మీ', 'జీత్విన్', 'లోటస్ 365' వంటి ప్లాట్ఫారమ్లను ఈ సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రచారకర్తలుగా వ్యవహరించినందుకు వీరు భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని, అయితే ఈ సేవలకు చట్టపరమైన స్థితిని ధృవీకరించలేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది.