Rashmika Mandanna: నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు 2025 ఏడాది ఒక మైలురాయిగా నిలిచింది. ఛావా, కుబేర, ది గర్ల్‌ ఫ్రెండ్‌ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె త్వరలోనే మైసా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తన సినీ ప్రయాణం గురించి ఆమె మనసు విప్పారు.

2025: గర్వించదగ్గ ఏడాది

ఈ ఏడాది తనకెంతో సంతృప్తినిచ్చిందని రష్మిక తెలిపారు. "ప్రతి సంవత్సరం ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్పలేం కానీ 2025 మాత్రం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. నా విజయం చూసి మా కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషించడం, ప్రేక్షకులు చూపిస్తున్న అమితమైన ప్రేమ నాకు దక్కిన అతిపెద్ద అవార్డు" అని ఆమె తెలిపారు.

ఒకే ఇమేజ్‌కు పరిమితం కాను

తనను కేవలం కొన్ని రకాల పాత్రలకే పరిమితం చేయవద్దని రష్మిక కోరుకుంటున్నారు. "కేవలం మంచి అమ్మాయి లేదా అమాయకపు పిల్లకు మాత్రమే నేను పరిమితం కాను. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలి" అని అన్నారు. కథ బాగుంటే దర్శకులు, రచయితలను నమ్మి వంద శాతం కష్టపడతానని ఆమె స్పష్టం చేశారు.

భాషా బేధాలు లేవు

తెలుగు, కన్నడ, తమిళం, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాలను సమానంగా గౌరవిస్తానని రష్మిక చెప్పారు. ఏ పరిశ్రమలో పనిచేసినా అంకితభావంతో ఉంటానని, అద్భుతమైన టీమ్స్‌తో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని ఆమె వెల్లడించారు.

Tags: