Movie Piracy Gang Busted: దేశవ్యాప్తంగా అతిపెద్ద సినిమా పైరసీ గ్యాంగ్ అరెస్ట్.. ఫిలిం ఇండస్ట్రీకి 22 వేల కోట్లకు పైగా నష్టం
ఫిలిం ఇండస్ట్రీకి 22 వేల కోట్లకు పైగా నష్టం
Movie Piracy Gang Busted: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ను బయటపెట్టారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు మరియు ఇంటర్నెట్ సంబంధిత పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. హిట్, కుబేరా, హరిహరవీరమల్లు వంటి చిత్రాల పైరసీపై విచారణ జరిపారు. నిందితులు తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా పైరేట్ చేశారు. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి 22,400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఇందులో టాలీవుడ్కు మాత్రమే 3,700 కోట్లు నష్టం జరిగింది. గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ చిత్రాలను విడుదల రోజునే లీక్ చేశారు. హ్యాష్ట్యాగ్ సింగిల్ మూవీ పైరసీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, వనస్థలిపురం నివాసి కిరణ్ను గతంలో అరెస్ట్ చేశారు. జూలై 3న అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి.
దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్లలో పైరసీ నిర్వాహకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. థియేటర్లలో ప్రదర్శనకు వచ్చే సినిమాల శాటిలైట్ కంటెంట్ ఐడీలు, పాస్వర్డ్లను ట్రాక్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఏజెంట్ల ద్వారా షర్ట్ పాకెట్లలో, పాప్కార్న్, కోక్ టిన్లలో కెమెరాలను దాచి సినిమాలను రికార్డ్ చేస్తున్నారు. ఈ కంటెంట్ను ఇతర వెబ్సైట్లకు విక్రయిస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టోకరెన్సీ ద్వారా కమీషన్లు చెల్లిస్తున్నారు.