Pawan Kalyan: జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినిమా కెరీర్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై కీలక స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఆయన కొత్తగా ఏ సినిమాకు సంతకం చేయలేదని, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన ఇప్పట్లో లేదని ఆయన అధికారిక నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ వర్గాల్లో పవన్ కల్యాణ్ తదుపరి చిత్రాల గురించి జరుగుతున్న ప్రచారంపై ఈ ప్రకటనతో ఫుల్‌స్టాప్ పడింది. "ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ గారు ఏ కొత్త సినిమా కమిట్‌మెంట్లు తీసుకోలేదు. ఆయన కొత్త ప్రాజెక్టులపై వస్తున్న ఊహాగానాలు వాస్తవం కాదు. సరైన సమయంలో ఏ విషయమైనా మేమే అధికారికంగా వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓజీ చిత్ర సీక్వెల్ ఓజీ 2 గురించి స్వయంగా పవన్ కల్యాణే సరైన సమయంలో అప్‌డేట్ ఇస్తారని టీమ్ వెల్లడించింది.

రాజకీయ బాధ్యతలకే పెద్దపీట:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ తన పూర్తి సమయాన్ని ప్రజా సేవకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు ఈ ప్రకటన ద్వారా అర్థమవుతోంది. గతంలో మోహన్ రాజా, దేవ కట్టా వంటి దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని వచ్చిన వార్తలను ఈ ప్రకటన పరోక్షంగా కొట్టిపారేసింది. అలాగే గతంలో ప్రకటించిన సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ భవిష్యత్తుపై కూడా ప్రస్తుతానికి సందిగ్ధత నెలకొంది.

ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ దృష్టి మొత్తం ఏపీ అభివృద్ధి, రాజకీయ బాధ్యతలపైనే కేంద్రీకృతమై ఉంది. అయితే, ఇప్పటికే సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే ఆయన కొత్త వాటి గురించి ఆలోచించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: