Idupu Kayitham: : ప్రియదర్శి కొత్త సినిమా ఇడుపు కాయితం..15 రూల్స్ పెట్టిన హీరోయిన్
15 రూల్స్ పెట్టిన హీరోయిన్
Idupu Kayitham: : వైవిధ్యమైన పాత్రలు.. విలక్షణమైన కథలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో మరో డిఫరెంట్ మూవీ తెరకెక్కుతోంది. జానపద గాయని నాగ దుర్గ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి.. ‘ఇడుపు కాయితం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఖరారు చేశారు.
‘ఇడుపు కాయితం’ అంటే తెలంగాణ వాడుక భాషలో ‘విడాకుల పత్రం’ అని అర్థం. టైటిల్తోనే అందరిలో క్యూరియాసిటీ పెంచేసిన ఈ సినిమా.. ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అంతేకాదు, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ విడుదల చేయడం విశేషం. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో.. ప్రముఖ నిర్మాత బన్నివాసు నిర్మిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ.. కథ బాగుంటే దానికి సరిహద్దులు ఉండవని, ఇది గ్లోబల్ స్థాయి కథ అని కొనియాడారు. ఈ తెలుగు సినిమాను బిహార్లో రిలీజ్ చేసినా అక్కడి ప్రజలు కూడా బాగా కనెక్ట్ అవుతారన్నారు. ప్రతి ఇంట్లో ఉండే ఒక కామన్ ప్రాబ్లమ్ను ఈ సినిమాలో చూపించబోతున్నామని.. పెళ్లయిన ప్రతి ఒక్కరికీ ఈ సమస్య తెలుసని చెప్పారు. ఏ కోడలైనా తన అత్తమామలను ఈ సినిమాకు తీసుకెళ్తే.. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ అత్తగారు కచ్చితంగా కోడలి చేతులు పట్టుకుని వస్తారంటూ సినిమాపై భారీ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇక హీరోయిన్ నాగదుర్గ గురించి చెబుతూ.. ఈ సినిమాలో నటించమని అడగ్గానే ఆమె తనకు 15 రూల్స్ పెట్టిందని, ఒక తెలుగు అమ్మాయి తన కెరీర్ విషయంలో ఎంత క్లారిటీగా ఉందో చూసి తాను చాలా ఆనందించానని బన్నివాసు చెప్పుకొచ్చారు.
సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చే సినిమాలు ఎంత విభిన్నంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ ‘ఇడుపు కాయితం’ సినిమా కూడా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సుకుమార్ భార్య తబిత ధీమా వ్యక్తం చేశారు.