Relief for Ashu Reddy: నటి అషురెడ్డికి ఊరట: సోషల్ మీడియా, మీడియా సంస్థలకు హైకోర్టు కీలక ఆదేశాలు

సోషల్ మీడియా, మీడియా సంస్థలకు హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2026-05-01 06:42 GMT

Relief for Ashu Reddy: గత కొన్ని రోజులుగా వివాదాల్లో ఉన్న సినీ నటి అషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారన్న ఆరోపణలతో ఆమెపై సిసిఎస్ (CCS)లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అషురెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా, అవమానకరంగా లేదా అవాస్తవంగా ఉండే ఎలాంటి వార్తలను ప్రసారం చేయకూడదని మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, కంటెంట్ క్రియేటర్లు ఇప్పటికే ఆమెపై పెట్టిన వివాదాస్పద పోస్టులను, వీడియోలను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కోర్టు తీర్పుపై అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "న్యాయస్థానం ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరుతున్నాను. నా ప్రైవసీని కాపాడాలని మీడియాను, నెటిజన్లను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది, కాబట్టి నాపై నిందలు వేయడం ఆపండి. అభ్యంతరకర పోస్టులను తొలగించి నాకు సహకరించాలని ఆశిస్తున్నాను. నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా ముందుకెళ్తాను" అని ఆమె పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News