Aamir Khan’s Interesting Remarks: సాయి పల్లవి తప్పేమీ లేదు: అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Aamir Khan’s Interesting Remarks: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఏక్ దిన్’ (EK Din). ఈ సినిమాలో కథానాయికగా టాలెంటెడ్ నటి సాయి పల్లవి నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ఒక్క రోజు కూడా థియేటర్లలో నిలబడలేకపోయింది.
ఈ సినిమాతోనే సాయి పల్లవి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే, సినిమా విడుదల కాకముందే ఈ పాత్రకు తాను సరిపోలేదని (miscast) ఆమె స్వయంగా అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు, ఈ సినిమా కథ గతంలో ఆమె శర్వానంద్తో కలిసి నటించిన ‘పడి పడి లేచే మనసు’ చిత్రానికి దగ్గరగా ఉందని ప్రేక్షకులు భావించారు. ఈ పోలికల వల్ల సినిమాలో ప్రేక్షకులకు ఎలాంటి కొత్తదనం కనిపించలేదు.
సినిమా ఇంత పెద్ద ఫెయిల్యూర్ అయినప్పటికీ, నిర్మాతగా అమీర్ ఖాన్ మాత్రం నటీనటులను వెనకేసుకొచ్చారు. సినిమా రిజల్ట్ పట్ల ఆయన నిరాశ చెందిన మాట వాస్తవమే అయినా.. ఈ పరాజయానికి సాయి పల్లవిని గానీ, ఇతర నటీనటులను గానీ బాధ్యులను చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఎంపిక చేసిన నటీనటుల విషయంలో తనకెలాంటి అసంతృప్తి లేదని ఆయన పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా అమీర్ ఖాన్కు అటు నటుడిగా, ఇటు నిర్మాతగా సరైన విజయాలు అందడం లేదు. ఆయన భారీ అంచనాలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులు వరుసగా వాణిజ్యపరంగా విఫలమవుతుండటం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కుమారుడి అరంగేట్రం కోసం చేసిన ఈ ‘ఏక్ దిన్’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అమీర్ ప్రస్తుతం కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు.