Upasana: 9 వారాల సాయిబాబా వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. ఇన్స్టా పోస్ట్ వైరల్
ఇన్స్టా పోస్ట్ వైరల్
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల తన ఆధ్యాత్మిక చింతనను మరోసారి చాటుకున్నారు. తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. గురు పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించినట్లు ఉపాసన గతంలో తెలిపారు. ఒక నర్సు అయిన లతా సిస్టర్తో కలిసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టానని తెలిపారు. వ్రతం ముగిసిన సందర్భంగా ఆమె తన అనుభూతిని వ్యక్తం చేస్తూ, "గురు పౌర్ణమి రోజున నేను ప్రారంభించిన తొమ్మిది వారాల సాయి వ్రతం.. శాంతి, స్వస్థత, విశ్వాసంతో కూడిన ప్రయాణంగా ముగిసింది. నేను కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు అందించిన బాబాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని తన పోస్ట్లో రాశారు.
అంతేకాకుండా బాబా కృపతో తన జీవితంలో మరింత ఎక్కువ మందికి సేవ చేసే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమకు నిత్యం రక్షణగా ఉంటున్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు చెప్పారు. వ్రతం పూర్తయిన సందర్భంగా 'అత్తమ్మాస్ కిచెన్' తరపున అన్నదానం చేస్తున్నట్లు కూడా ఉపాసన ప్రకటించారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించడం పట్ల నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.