Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, టికెట్ ధరల విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక వివేకవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ (నైజాం) ప్రాంతంలో రెగ్యులర్ షోలకు ఎటువంటి అదనపు ధరలు పెంచకుండా, సాధారణ ధరలకే టికెట్లను విక్రయించాలని నిర్ణయించారు.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం లేదా మొదటి వీకెండ్‌లో టికెట్ రేట్లు పెంచడం ఈ మధ్య కాలంలో ఆనవాయితీగా మారింది. కానీ, పెరిగిన ధరల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కొంత వెనకాడుతున్నారని గమనించిన చిత్ర యూనిట్, సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తెలంగాణలో స్టాండర్డ్ షోల కోసం ఎటువంటి రేట్ల పెంపు లేదు. సాధారణ ధరలకే బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏపీలో మాత్రం మొదటి 10 రోజుల పాటు (మార్చి 19 - 28) సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్సుల్లో రూ. 125 వరకు ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మార్చి 19 తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రదర్శించే స్పెషల్ షోలకు పర్మిషన్ లభించింది. ఏపీలో ఈ షో టికెట్ ధర గరిష్టంగా రూ. 500 గా ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags: