మల్లిఖర్జునుడి ఉచిత స్పర్శ దర్శనం పునఃప్రారంభం
శ్రీశైలంలో జూలై 1వ తేదీ నుంచి మల్లిఖార్జునస్వామి ఉచిత స్పర్శ దర్శనం పునరుద్దరించనున్నట్లు దేవస్ధానం కార్యనిర్వహణ అధికారి ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.35 గంటల వరకూ భక్తులకు ఉచితంగా మల్లిఖార్జునస్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు ఈఓ తెలిపారు. ఉచిత స్పర్శ దర్శనం కోసం కంప్యూటరైజ్డ్ టికెట్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ఈఓ వెల్లడించారు. ప్రస్తుతానికి దేవస్ధానం వద్దే ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్లు జారీ చేస్తామని, త్వరలో ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రవేశపెడతామని ఈఓ తెలిపారు. దేవస్ధానం జారీ చేసి ఉచిత స్పర్శ దర్శన టోకెన్లలో భక్తుల పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్లు ఉంటాయని చెప్పారు. పరిస్ధితులను బట్టి రోజుకి వెయ్యి నుంచి పన్నెండొందల మందికి ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఈఓ అన్నారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవలు, ఉగాది, దసరా పండుగలు, శ్రావణ, కార్తీక మాసాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఉచిత స్పర్శ దర్శనం ఉండదని ఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు.