జూన్ 9 నుంచి శ్రీవారికి జ్యేష్టాభిషేకం

Update: 2025-06-06 05:34 GMT

ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తిరుమల‌ శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణ ప్రాకారం లోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీన విగ్రహాలైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు.

Tags:    

Similar News