Utlotsavam: తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో వైభవంగా ఉట్లోత్సవం
వైభవంగా ఉట్లోత్సవం
Utlotsavam: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శనివారం ఉట్లోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
శ్రీకృష్ణ పరమాత్మను స్మరిస్తూ ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, అనంతరం ఊంజల్సేవ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వేడుకలను వైభవంగా నిర్వహించారు.
శ్రీకృష్ణుని బాలలీలలను స్మరింపజేసే ఉట్లోత్సవాన్ని భక్తులు భక్తిప్రపత్తులతో వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.