MP Merit Awards-2025 : విద్య అందరికీ గొప్ప శక్తినిచ్చే ఆయుధం

అలెప్పుజలో ఎంపీ మెరిట్‌ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Update: 2025-09-01 05:00 GMT

దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని, అందుకే తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి.. అని బలంగా విశ్వసిస్తా అని అన్నారు. కేరళలోని అలప్పుజలో లోక్‌సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ ప్రతిభ కనబరిచే విద్యార్థినీ విద్యార్థులకు ఎంపీ మెరిట్ అవార్డులు-2025 బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యకు కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని, దేశంలో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అణిచివేత, అన్యాయానికి గురవుతున్న బాధితుల గొంతుకగా వేణుగోపాల్ నిరంతరం నిరుపేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలుస్తున్నారు. 10 వ, 12 తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం 2006 లో ప్రారంభించి 19 ఏళ్లుగా పొంథువల్ ఎంపీ మెరిట్ అవార్డులను బహూకరించడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి.

రానున్న రోజుల్లో విద్యకున్న ప్రాధాన్యత గురించి నేను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతుంటా. విద్యా రంగంపై ప్రభుత్వాలకు సరైన ఫోకస్ లేని కారణంగానే ప్రభుత్వంకన్నా ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాలుగా తీసుకుని పనిచేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాలుగా తీసుకుని పనిచేస్తున్నాం. అందుకే తెలంగాణలో వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలు నిర్మిస్తున్నాం. ప్రతి పాఠశాలకు 200 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక్కో క్యాంపస్ లో 2500 విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీయం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లవుతున్న 2047 నాటికి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో తెలంగాణ నుంచి 10 శాతం మేరకు దోహదపడాలన్న సంకల్పంతో 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా మా రాష్ట్రం లక్ష్యంగా నిర్ధేశించుకుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ విద్యార్థుల్లో సరైన నైపుణ్యత లేని కారణంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, అందుకే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు, నిష్ణాతులతో కలిసి రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని రేవంత్‌రెడ్డి చెప్పారు. మార్కెట్ లోకి అధునాతన కార్లు వస్తున్న దశలో పాత అంబాసిడర్ కార్లను రిపేర్ చేసే మెకానిక్ కోర్సులను బోధించే ఐటీఐలను టాటా టెక్నాలజీస్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో వాటిని పూర్తిగా మార్చి వేసి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నాం. మొత్తం 3500 విద్యార్థినీ విద్యార్థులకు ఈ మెరిట్ అవార్డుల బహూకరించగా, ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ గారితో పాటు కేరళ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామస్, డీఆర్డీఓ అగ్ని 4 మిసైల్ ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ డాక్టర్ టెస్సీ థామస్ తో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:    

Similar News