New COVID-19 Variant BA.3.2: కోవిడ్ కొత్త వేరియంట్ BA.3.2 కలకలం.. నిపుణులు ఏమంటున్నారు?
నిపుణులు ఏమంటున్నారు?
New COVID-19 Variant BA.3.2: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అమెరికా సహా సుమారు 20 దేశాల్లో కోవిడ్-19 పాత వేరియంట్ అయిన SARS-CoV-2 BA.3.2 కేసులు వేగంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మాస్కుల యుగం వస్తుందా? బూస్టర్ డోస్లు అవసరమా? అనే చర్చ మొదలైంది.
ఏమిటీ BA.3.2 వేరియంట్?
నిజానికి ఇది కొత్త వేరియంట్ ఏమీ కాదు. 2024లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా దీనికి సంబంధించిన కేసులు వెలుగుచూశాయి. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని యూఎస్ సీడీసీ (CDC) హెచ్చరించింది.
ఉత్పరివర్తనాలు: ఈ వేరియంట్ స్పైక్ ప్రోటీన్లో సుమారు 75 ఉత్పరివర్తనాలు ఉన్నాయి. దీనివల్ల ఇది రోగనిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
భారత్పై ప్రభావం ఎంత?
ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ వివరణ ప్రకారం.. భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన దేశంలో అత్యధిక శాతం మందికి ఇప్పటికే టీకాలు వేయబడ్డాయి. దీనివల్ల వైరస్ సోకినా తీవ్రమైన లక్షణాలు కనిపించే అవకాశం తక్కువ. ప్రస్తుతం భారతదేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు ఏవీ నమోదు కాలేదు. ఒకవేళ వచ్చినా అవి తేలికపాటి లక్షణాలతోనే ఉండవచ్చు.
మాస్కులు, బూస్టర్లు మళ్లీ అవసరమా?
ప్రభుత్వం నుంచి ప్రస్తుతం మాస్కులపై ఎలాంటి తప్పనిసరి మార్గదర్శకాలు లేవు. అయితే నిపుణుల సూచనలు ఇవే..
స్వచ్ఛంద జాగ్రత్త: ఆసుపత్రులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ మాత్రమే కాకుండా ఇతర శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
బూస్టర్ డోస్: ప్రజలకు ఇప్పటికే టీకాలు వేయబడినందున, ప్రస్తుతానికి కొత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. టీకా ఇన్ఫెక్షన్ను పూర్తిగా నిరోధించలేకపోయినా, ప్రాణాపాయం కలగకుండా రక్షిస్తుంది.
కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా, గతంలోలాగా తీవ్రమైన ముప్పు ఉండే అవకాశం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. భయం వద్దు కానీ.. అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.