కరోనా కొత్త వేరియంట్
కోవిడ్ JN. 1 వేరియంట్ అంటున్న వైద్యులు;
సింగపూర్, చైనా, థాయిలాండ్లోనే కాదు.. భారత్లోనూ కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడచిన వారం రోజులుగా భారత్ లో కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనావైరస్ జె.ఎన్. 1 వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 45 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా.. కర్నాటకలో 35, ఢిల్లీలో 27 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 23 కరోనా కేసులు నమోదయ్యాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపింది. విశాఖ, కడపలో రెండు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ ప్రైవేట్ డాక్టర్కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే.. కరోనా కేసులు పెరగడానికి కారణం.. కోవిడ్ JN. 1 వేరియంట్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కోవిడ్ కొత్త వేరియంట్ గా చెబుతున్నారు.. కానీ ఇది నిజంగా కొత్త వేరియంటా..? దాని గురించి భయపడాల్సిన అవసరం ఉందా? కరోనా కేసులు పెరగడంపై నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..దేశవ్యాప్తంగా జె.ఎన్. 1 వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఢిల్లీ ఎయిమ్స్లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. ఈ వైరస్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.. కానీ ఇది కోవిడ్ కొత్త వేరియంట్ కాదు. ఇది దాదాపు ఏడాదిన్నర క్రితం గుర్తించిన పాత వేరియంట్.. ఇది ఓమిక్రాన్ సబ్ వేరియంట్.. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.. కానీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. అని చెప్పారు.JN.1 వేరియంట్ అన్ని లక్షణాలు మునుపటిలాగే ఉన్నాయని.. దగ్గు, జలుబు, తలనొప్పి, తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ సంజయ్ రాయ్ వివరించారు. రోగులలో శ్వాసకోశ సమస్యలు కనిపించడం లేదు. కరోనా ఒక వైరస్ అని.. వైరస్లు ఎప్పటికీ పూర్తిగా పోవు అని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుందన్నారు.. వైరస్ తనను తాను సజీవంగా ఉంచుకోవడానికి పరివర్తన చెందుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కొత్త వైవిధ్యాలు కూడా వస్తూనే ఉంటాయన్నారు. కానీ జె.ఎన్. 1 కొత్తది కాదు. ఇది పాత వ్యాధి.. దాని లక్షణాలు కూడా తేలికపాటివి. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, లక్షణాలలో గణనీయమైన తేడా లేదని డాక్టర్ వివరించారుమునుపటిలాగా ఇప్పుడు కోవిడ్ నుండి తీవ్రమైన ప్రమాదం లేదని డాక్టర్ రాయ్ చెప్పారు. కొన్ని కేసులు వస్తూనే ఉంటాయి, కానీ వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం ఉండదన్నారు. అయితే, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. ప్రత్యేకించి రద్దీగా ఉండే ప్రాంతాల్లో తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలంటూ సూచించారు.