H-1B Visa Stricter Rules: హెచ్-1బీ వీసా: లక్ష డాలర్ల భారం మరిచిపోకముందే.. మరిన్ని కఠిన నిబంధనలు!
మరిన్ని కఠిన నిబంధనలు!
H-1B Visa Stricter Rules: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కొత్త హెచ్-1బీ వీసాలపై (H-1B Visa) లక్ష డాలర్ల ఫీజు విధించి, మన దేశ ఐటీ రంగాన్ని కలవరపరిచారు. ఈ ఆందోళనలు తగ్గకముందే, హెచ్-1బీ వీసా కార్యక్రమంలో మరిన్ని సంస్కరణలను ట్రంప్ పరిపాలన ప్రతిపాదించింది. ‘హెచ్-1బీ నాన్ఇమిగ్రెంట్ వీసా వర్గీకరణ కార్యక్రమాన్ని సంస్కరించడం’ అనే శీర్షికతో ఈ కొత్త ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్లో లిఖించబడినాయి.
డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) సూచనల ప్రకారం.. వీసా పరిమితి మినహాయింపుల అర్హతలను మరింత కట్టుదిట్టం చేయడంతోపాటు, నియమాల ఉల్లంఘనలు చేసే యజమానులు, మూడో పక్ష నియామకాలపై కఠిన దృష్టి సారించనున్నారు. ‘‘ఈ మార్పులు హెచ్-1బీ కార్యక్రమం యొక్క విశ్వసనీయతను పెంచడానికి, అమెరికా కార్మికుల వేతనాలు మరియు పని పరిస్థితులకు రక్షణ ఇవ్వడానికి రూపొందించినవి’’ అని ప్రతిపాదనల్లో వివరించారు (H-1B visa programme).
అయితే, ఈ ప్రతిపాదనల అమలు గురించి స్పష్టత లేదు. మినహాయింపుల పరిమితుల్లో మార్పులు వస్తే.. లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు తమ ప్రయోజనాలను కోల్పోవచ్చని అంతర్జాతీయ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇది భారత్ నుంచి అమెరికా కలలు కనే వేలాది విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త నియమాలు 2025 డిసెంబర్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక, ట్రంప్ (Donald Trump) ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల ఫీజు గత నెల నుంచి అమలవుతోంది. దీనికి అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక సంవత్సరం పాటు గడువు ఉంది. ఈలోపు అమెరికా కాంగ్రెస్లో చట్టం ఆమోదం పొందితే, పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. భారత్ నుంచి హెచ్-1బీ వీసాతో అమెరికా వెళ్లే సగటు ఉద్యోగి వార్షిక వేతనం 60,000 నుంచి 1,40,000 డాలర్ల మధ్య ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావడం కష్టమేనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచినా, భారతీయ ఐటీ కంపెనీలపై పెద్దగా ప్రభావం ఉండదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, వీసా కార్యక్రమంలో మార్పులు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత లాటరీ పద్ధతిని మార్చడానికి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అధిక నైపుణ్యం గల విదేశీయులకు మాత్రమే అనుమతి ఇవ్వడం, అమెరికన్లకు ప్రాధాన్యత కల్పించడం దీని లక్ష్యమని తెలుస్తోంది.