Us President Donald Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాచాలత్వం…

పాకిస్తాన్‌ నుంచి చమురు కొనే పరిస్ధితి భారత్‌కు రావచ్చన్న ట్రంప్‌;

Update: 2025-07-31 08:15 GMT

అత్యధిక సుంకాలు విధిస్తామనే బెదిరింపులతో పలు దేశాలను, యూరోపియన్‌ యూనిన్‌ని దారిలోకి తెచ్చుకున్న ట్రంప్‌ తాజాగా భారత్‌పై పడ్డారు. తన వాచాలత్వంతో ట్రంప్‌ చేస్తున్న అసంబద్ద వ్యాఖ్యాలు భారత ప్రజానీకానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భారత్‌ ని టార్గెట్‌ గా చేసుకుంటూ ప్రధాని నరేంద్రమోడీని ఇబ్బందులు పెట్టేలా ట్రంప్‌ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న ఉగ్రస్ధావరాలపై ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో భారత్‌ జరిపిన దాడులు ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులకు దారితీశాయి. ఈ మధ్యలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దూరి తాను చెప్పడం వల్లే భారత్‌ యుద్దాన్ని విరమించుకుందని ప్రచారం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని భారత ప్రధానితో పాటు హోంమంత్రి, రక్షణ మంత్రులు కూడా అనేక సందర్భాలలో ఖండించినప్పటికీ ట్రంప్‌ వైఖరిలో మాత్రం మార్పులేదు. సమయం, సందర్భం లేకుండా ఎక్కడపడితే అక్కడ భారత్‌, పాక్‌ లమధ్య యుద్దం నా వల్లే ఆగిపోయిందని ప్రకటించుకుంటూ తన అల్పబుద్దిని చాటుకుంటున్నాడు. ఇక సుంకాలకు సంబంధించి అన్ని దేశాలతో వ్యవహరించినట్లే భారత్‌ విషయంలో కూడా బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా రష్యా దేశంతో భారత్‌ ఎటువంటి వాణిజ్యపరమైన లావాదేవీలు నిర్వహించడానికి వీలు లేదన్నట్లుగా ట్రంప్‌ వ్యాఖ్యలు ఉంటున్నాయి. తాజగా రష్యా, భారత్‌ దేశాలు పూర్తిగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్ధలని వ్యాఖ్యానించారు. రష్యా నంచి ముడి చమురు కొనవద్దని కొంటే పెనాల్టీలు వేస్తామని హద్దు మీది మరీ మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంలో మరో ముందడుగు వేసి పాకిస్తాన్‌ దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసే పరిస్ధితులు భారత్‌ కు వస్తాయని భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. పాకిస్తాన్‌ ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటుకు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని కూడా భారతీయులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ విధంగా భారత్‌, పాక్‌ల మధ్య వైషమ్యాలు పెంచేలా ట్రాంప్‌ వ్యాఖ్యానించడం భారతీయులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. చమురు నిల్వలు అభివృద్ధి చేసుకునేందుకు ఈ మధ్యనే పాకిస్తాన్‌ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుందని కూడా ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్రూత్‌ వేదికగా ఇటువంటి ప్రకటన చేశారు. తాను వైట్‌ హౌస్‌ లో చాలా బిజీ బిజీగా ఉన్నానని అనేక దేశాలతో సుంకాల పై చర్చిస్తున్నట్లు ట్రంప్‌ అన్నారు. భారతదేశంపై కూడా 25 శాతం సుంకాలను విధించనున్నామని, అయితే ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని, తర్వలో భారత్‌, అమెరికాల మధ్య సుంకాల వ్యవహారంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ట్రంప్‌ అంటున్నారు. మొత్తం మీద ఇటీవల కాలంలో భారత్‌ దేశాన్ని టార్గెట్‌ చేసుకుని ట్రంప్‌ చేస్తున్నవ్యాఖ్యలు భారతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Tags:    

Similar News