US Secretary of State Marco Rubio: పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకలను మోహరించడంతో ఇరాన్‌పై ఎప్పుడైనా దాడి జరగవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని అధికారం నుంచి తప్పిస్తే, తర్వాత అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఎవరికీ తెలియదని అన్నారు. సెనెట్‌ విదేశీ సంబంధాల కమిటీ ముందు ఆయన ఈ మాటలు చెప్పారు.

ఇరాన్‌లో పాలన మార్పు తర్వాత ఏమవుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ రూబియో మాట్లాడుతూ.. 'ఇది ఒక తెరిచిన ప్రశ్నే. అధికారం ఎవరు చేపట్టేది అనేది ఎవరికీ తెలియదు. ఇరాన్‌ పాలనా వ్యవస్థ ఖమేనీ, ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) మరియు ఎన్నికైన అధికారుల మధ్య విభజించబడి ఉంది. వీరంతా చివరికి ఖమేనీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తారు. సుప్రీం లీడర్‌ మరియు ప్రభుత్వం కూలిపోతే, అక్కడ తదుపరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఇది వెనెజువెలా కంటే మరింత సంక్లిష్టంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ఎన్నో సంవత్సరాలుగా బలంగా నిలిచి ఉంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి' అని వివరించారు.

ట్రంప్‌ నిర్ణయంపై స్పందిస్తూ, పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలగాలను బలోపేతం చేయడం గురించి రూబియో మాట్లాడారు. ఈ చర్య లక్ష్యం అమెరికా సైనికులను రక్షించడమేనని చెప్పారు. సైనిక చర్యలు అవసరం లేకుండా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఇరాన్‌ తన సామర్థ్యాన్ని ఉపయోగించి అమెరికా బలగాలు మరియు భాగస్వాములపై దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Tags: