Jairam Ramesh: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితవ్యంపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ ఇస్రోను మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని తీవ్రంగా ఆరోపించారు.

ఆరు దశాబ్దాలుగా ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషితో నిర్మించుకున్న సామర్థ్యాలను, మౌలిక వసతులను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. రాకెట్ల తయారీ, ప్రయోగ వాహనాల ఉత్పత్తిలో ఇస్రో పాత్రను గణనీయంగా తగ్గించి, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ బాధ్యతలు అప్పగించే దిశగా ప్రభుత్వం వెళ్తోందని జైరామ్ రమేష్ అన్నారు.

ఇటీవల వెలువడిన వార్తలు ఇస్రో భవిష్యత్ పాత్రపై ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ అంతరిక్ష సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయి ప్రతిభను భారత్‌కు ఆకర్షించేలా బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇస్రో క్రమంగా ప్రయోగ వాహనాల తయారీ, సాధారణ ఉపగ్రహాల తయారీ నుంచి దూరమవుతున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

జైరామ్ రమేష్ ఆరోపణలు ఇస్రో ప్రైవేటీకరణపై తాజా చర్చను మరింత ఉద్దీపనపరిచాయి.

Tags: